Skip to content

యోం కిప్పుర్ – అసలైన దుర్గా పూజ

  • by

దుర్గా పూజ (లేక దుర్గోత్సవము) అశ్విని మాసములోని 6-10 దినములలో దక్షిణ ఆసియా ప్రాంతములోని అనేక చోట్ల జరపబడుతుంది. దుర్గా దేవి ప్రాచీన కాలములో అసురుడైన మహిషాసురుడుతో చేసిన యుద్ధములో పొందిన జయమును జ్ఞాపకము చేసుకొనుటకు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండుగ మూడు వేల ఐదువందల సంవత్సరముల క్రితం ఆరంభమై, హెబ్రీ సంవత్సరములోని ఏడవ చంద్రమాన మాసములోని పదియవ రోజున జరుపుకొను మరింత ప్రాచీన పండుగయైన యోం కిప్పుర్ ను (లేక ప్రాయశ్చిత్త దినము) పోలియున్నదని చాలామంది భక్తులు గ్రహించరు. ఈ రెండు పండుగలు ప్రాచీనమైనవి, మరియు ఈ రెండు పండుగలు తమ తమ క్యాలెండర్లలో ఒకే దినమున జరుపబడతాయి (హిందు మరియు హెబ్రీ క్యాలెండర్లలో అదనపు లీప్ మాసము వేర్వేరు సంవత్సరములలో ఉంటుంది, కాబట్టి ఇవి పాశ్చాత్య క్యాలెండర్ లో ఒకే దినమున జరుపబడవు, కాని ఇవి ఎల్లప్పుడు సెప్టెంబర్-అక్టోబర్ మాసములలో జరుపబడతాయి), ఈ రెంటిలో బలులు ఉన్నాయి, మరియు ఈ రెండు గొప్ప విషయములను జ్ఞాపకము చేసుకుంటాయి. దుర్గా పూజ మరియు యోం కిప్పుర్ ల మధ్య ఉన్న పోలికలు ఆశ్చర్యకరమైనవి. కొన్ని భిన్నత్వములు కూడా అంతే ఆశ్చర్యకరమైనవిగా ఉన్నాయి.

ప్రాయశ్చిత్త దినము పరిచయం చేయబడుట

మోషే మరియు అతని సహోదరుడైన అహరోను ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించారు మరియు యేసు జననమునకు పదిహేను వందల సంవత్సరముల మునుపు ధర్మశాస్త్రమును పొందుకున్నారు 

కలియుగములో ఇశ్రాయేలీయులను (హెబ్రీయులు లేక యూదులు) బానిసత్వము నుండి విడిపించి వారిని నడిపించుటకు పది ఆజ్ఞలను పొందుకున్న శ్రీ మోషేను గూర్చి మనము ఇంతకు ముందు చూశాము. ఆ పది ఆజ్ఞలు చాలా కఠినమైనవి, మరియు ఒక పాపము ద్వారా ప్రేరేపించబడు వ్యక్తి వాటిని పాటించుట అసాద్యము. ఈ ఆజ్ఞలను నిబంధన మందసము అని పిలువబడు ఒక విశేషమైన పెట్టెలో పెట్టారు. ఈ నిబంధన మందసము అతి పరిశుద్ధ స్థలము అని పిలువబడు ఒక విశేషమైన దేవాలయములో ఉంచబడింది.

మోషే సహోదరుడైన అహరోను మరియు అతని వారసులు ప్రజల పాపములను కప్పుపుచ్చుటకు లేక ప్రాయశ్చిత్తము చెల్లించుటకు ఈ దేవాలయములో పూజారులుగా బలులు అర్పించేవారు. యోం కిప్పుర్ – ప్రాయశ్చిత్త దినమున విశేషమైన బలులు అర్పించబడేవి. ఇవి నేడు మనకు విలువైన పాఠములైయున్నవి, మరియు ప్రాయశ్చిత్త దినమును (యోం కిప్పుర్) దుర్గాపూజలోని ఆచారములతో పోల్చుట ద్వారా మనము అనేక విషయములను నేర్చుకోవచ్చు.

ప్రాయశ్చిత్త దినము మరియు విడిచిపెట్టబడు మేక (బలిపశువు)

హెబ్రీ వేదములు, అనగా నేటి బైబిలు, ప్రాయశ్చిత్త దినమున అర్పించవలసిన బలులు మరియు చేయవలసిన ఆచారములను గూర్చి మోషే దినముల నుండే ఖచ్చితమైన హెచ్చరికలను ఇచ్చింది. ఈ హెచ్చరికలు ఏ విధంగా ప్రారంభమైయ్యాయో మనము చూస్తాము:

అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను
​నేను కరుణాపీఠము మీద మేఘ ములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము. 

లేవీయకాండము 16:1-2 

ప్రాధాన పూజారియైన అహరోను యొక్క ఇద్దరు కుమారులు దేవుని సన్నిధి ఉన్న అతిపరిశుద్ధ స్థలములోనికి అమర్యాదగా ప్రవేశించినప్పుడు, వారిద్దరు మరణించారు. పది ఆజ్ఞలను పూర్తిగా పాటించుటలో విఫలమైనందున ఆ పరిశుద్ధ సన్నిధిలో వారు మరణించారు.  

కాబట్టి జాగ్రత్తతో కూడిన హెచ్చరికలు ఇవ్వబడినవి, దీనిలో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన పూజారి సంవత్సరములో ఒక్కసారి మాత్రమే ప్రవేశించగల దినము కూడా ఇవ్వబడినది – అదే ప్రాయశ్చిత్త దినము. వేరొక దినమున అతడు ప్రవేశిస్తే, అతడు నిశ్చయముగా మరణిస్తాడు. అయితే ఈ దినమున కూడా, నిబంధన మందసము ఉన్న స్థలములోనికి ప్రవేశించుటకు ముందు ప్రధాన పూజారి ఈ విధంగా చేయవలసి ఉండేది:

అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.
అతడు ప్రతిష్ఠిత మైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననారపాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్ర ములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను. 

లేవీయకాండము 16: 3-4

దుర్గా పూజ యొక్క సప్తమి రోజున, ప్రాణ ప్రతిష్టన్ ద్వారా దుర్గా దేవి విగ్రహములలోనికి ఆహ్వానించబడుతుంది మరియు తరువాత విగ్రహమును కడిగి, వస్త్రములను ధరింపజేస్తారు. యోం కిప్పుర్ లో కూడా స్నానము చేయబడుతుంది, కాని దేవుడు గాక ప్రధాన పూజారి స్నానము చేసి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లుటకు సిద్ధపడతాడు. దేవుడైన యెహోవాను ఆహ్వానించవలసిన అవసరం ఉండేది కాదు – ఎందుకంటే అతిపరిశుద్ధ స్థలములో ఆయన సన్నిధి సంవత్సరము అంతా ఉండేది. కాబట్టి ఆయన సన్నిధిలోనికి ప్రవేశించుటకు సిద్ధపడవలసిన అవసరత ఉండేది. స్నానము చేసి, వస్త్రములు ధరించిన తరువాత, పూజారి బలులను అర్పించుటకు జంతువులను తేవలసియుండేది.

మరియు అతడు ఇశ్రాయేలీయుల సమా జము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను. 
అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి 

లేవీయకాండము 16: 5-6

కప్పుటకు, లేక, ప్రాయశ్చిత్తము చెల్లించుటకు అహరోను కుమారులు ఒక ఎద్దును బలి అర్పించేవారు. దుర్గా పూజ సమయములో కూడా ఎద్దు లేక మేకల బలులు అర్పించబడతాయి. యోం కిప్పుర్ విషయములో, పూజారి యొక్క సొంత పాపములను కప్పిపుచ్చుకొనుటకు ఒక ఎద్దును బలి అర్పించుట ఒక ఎంపిక మాత్రమే కాదు. పూజారి తన పాపమును బలి ద్వారా కప్పుకొనకపోతే అతడు నిశ్చయముగా మరణిస్తాడు.

తరువాత వెంటనే, యాజకుడు ఒక ప్రత్యేకమైన రెండు మేకల సంస్కారమును జరిగించేవాడు.

ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. 
అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక1 పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను. 
ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. 

లేవీయకాండము 16: 7-9

తన సొంత పాపముల కొరకు ఎద్దును అర్పించిన తరువాత, పూజారి రెండు మేకలను తీసుకొని చీట్లు వేసేవాడు. ఒక మేకను విడిచిపెట్టబడు మేకగా లేక బలిపశువుగా నిర్ధారించేవాడు. మరొక మేక పాపపరిహారార్థబలిగా వధించబడేది. ఎందుకు?

15 అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధబలియగు మేకను వధించి అడ్డ తెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్త ముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను. 
16 అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. 

లేవీయకాండము 16: 15-16

విడిచిపెట్టబడిన మేకకు లేక బలిపశువుకు ఏమవుతుంది?

20 అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను. 
21 అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను. 
22 ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్ట వలెను. 

లేవీయకాండము 16: 20-22

ఎద్దు బలి అహరోను సొంత పాపముల కొరకు అర్పించబడేది. మొదటి మేక యొక్క బలి ఇశ్రాయేలు ప్రజల పాపముల కొరకు అర్పించబడేది. తరువాత సజీవమైన బలి పశువు తల మీద అహరోను తన చేతులను ఉంచి – చిహ్నాత్మకముగా – ప్రజల పాపములను దాని మీదికి నెట్టేవాడు. తరువాత ప్రజల పాపములు వారి యొద్ద నుండి దూరమైపోయాయి అని చూపుటకు చిహ్నాత్మకముగా ఆ మేకను అరణ్యములోనికి తోలివేసేవారు. ఇలా ప్రతి సంవత్సరము ప్రాయశ్చిత్త దినమున, అనగా ప్రాయశ్చిత్త దినమున మాత్రమే చేసేవారు.

ప్రాయశ్చిత్త దినము మరియు దుర్గా పూజ

ప్రతి సంవత్సరము ఈ రోజున మాత్రమే ఈ పండుగను జరపాలని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? దీని అర్థము ఏమిటి? దుర్గా పూజ దుర్గా గేదె రాక్షసుడైన మహిషాసురుని జయించిన దినమును జ్ఞాపకము చేసుకుంటుంది. ఇది మునుపు జరిగిన సన్నివేశమును జ్ఞాపకము చేసుకుంటుంది.  ప్రాయశ్చిత్త దినము కూడా జయమును జ్ఞాపకము చేసుకుంటుంది గాని, భవిష్యత్తులో కలుగు జయమును జ్ఞాపకము చేసుకుంటుంది. నిజమైన జంతు బలులను వారు అర్పించేవారుగాని, అవి కూడా చిహ్నాత్మకముగానే ఉన్నాయి. వేద పుస్తకము (బైబిలు), దీనిని వివరిస్తుంది 

ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 

హెబ్రీయులకు 10:4

ప్రాయశ్చిత్త దినమున అర్పించబడు బలులు యాజకుడు మరియు భక్తుల యొక్క పాపములను పూర్తిగా తీసివేయలేవు కాబట్టి, వాటిని ప్రతి సంవత్సరము ఎందుకు అర్పించేవారు? వేద పుస్తకము (బైబిలు), ఇలా వివరిస్తుంది

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.
ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. 
అయితే ఆ బలులు అర్పిం చుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి 

హెబ్రీయులకు 10:1-3

బలులు పాపములను పూర్తిగా శుద్ధి చేయగలిగితే, వాటిని మరలా మరలా అర్పించవలసిన అవసరత ఉండేది కాదు. కాని అవి ప్రతి ఏటా పునరావృతం చేయబడేవి కాబట్టి, అవి ప్రభావవంతమైనవి కావని అర్థమవుతుంది.

కాని యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడు ఇది మారిపోయింది.

కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి. 
పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు. 
అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. 

హెబ్రీయులకు 10:5-7

ఆయన తనను తాను బలిగా అర్పించుకొనుటకు వచ్చాడు. మరియు ఆయన అలా బలి అర్పించినప్పుడు

10 యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. 

హెబ్రీయులకు 10: 10

రెండు మేకల యొక్క బలులు చిహ్నాత్మకముగా భవిష్యత్ బలి మరియు యేసు యొక్క విజయము వైపునకు చూపాయి. ఆయన బలి అర్పించబడ్డాడు కాబట్టి బలి అర్పించబడిన మేక ఆయనే. బలిపశువు లేక విడిచిపెట్టబడిన మేక కూడా ఆయనే, ఎందుకంటే ఆయన సర్వలోక సమాజము యొక్క పాపములను తన మీద వేసుకొని, మనము శుద్ధిచేయబడునట్లు వాటిని మన నుండి దూరము చేశాడు.

ప్రాయశ్చిత్త దినము దుర్గా పూజకు కూడా కారణమైయ్యిందా?

ఇశ్రాయేలు నుండి ప్రవాసీయులు క్రీ.పూ 700లలో భారతా దేశమునకు వచ్చిన విధానమును, మరియు భారత దేశములోని మతములు మరియు విద్యల మీద వారు చూపిన ప్రభావమును గూర్చి మనము ఇశ్రాయేలీయుల చరిత్రలో చూశాము.  ఈ ఇశ్రాయేలీయులు ప్రతి ఏటా ఏడవ నెల పదియవ దినమున ప్రాయశ్చిత్త దినమును జరుపుకునేవారు. భారత దేశములోని భాషలకు వారు తోడ్పాటును ఇచ్చిన విధముగానే, వారు తమ ప్రాయశ్చిత్త దినమును కూడా ఇచ్చారు, అది చెడు మీద గొప్ప విజయమును జ్ఞాపకము చేసుకొను దుర్గా పూజగా మారింది. ఈ ఆలోచన దుర్గా పూజను గూర్చి మనము కలిగియున్న చారిత్రిక అవగాహనకు సరిపోతుంది, దుర్గా పూజ క్రీ.పూ. 600లలో ఆరంభమైయ్యింది.

ప్రాయశ్చిత్త దిన బలులు ఆగిపోయినప్పుడు

మన కొరకు యేసు (యేసు సత్సంగ్) అర్పించిన బలి ప్రభావవంతమైనది మరియు పరిపూర్ణమైనది. యేసు సిలువ మీద బలిగావించబడిన (క్రీ.శ. 33) తరువాత, కొంత కాలమునకు రోమీయులు క్రీ.శ. 70లో అతిపరిశుద్ధ స్థలమున్న దేవాలయమును ధ్వంసం చేశారు. ఆ దినము తరువాత నేటి వరకు యూదులు ఎన్నడు కూడా ప్రాయశ్చిత్త దినమున బలులను అర్పించలేదు. నేడు, యూదులు ఉపవాసముండుట ద్వారా ఈ దినమును ఆచరిస్తారు. బైబిలు వివరించుచున్నట్లు, ఒక ప్రభావవంతమైన బలి అర్పించబడిన తరువాత జంతువుల బలులను అర్పించుటను కొనసాగించవలసిన అవసరం లేదు. కాబట్టి దేవుడు వాటిని ఆపివేశాడు.

దుర్గా పూజ మరియు ప్రాయశ్చిత్త దినమున విగ్రహములు

విగ్రహములో దేవత నివసించునట్లు దుర్గా పూజ దినమున దుర్గా దేవి ఆహ్వానించబడుతుంది. ప్రాయశ్చిత్త దినము రానున్న బలిని గూర్చి జ్ఞాపకము చేసుకునేది కాబట్టి, దానిలో ఏ విగ్రహమును పెట్టేవారు కాదు. అతిపరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడు అదృశ్యుడు కాబట్టి, దానిలో ఎలాంటి విగ్రహము ఉండేది కాదు.  

కాని, ముందుగానే కొన్ని వందల సంవత్సరముల పాటు జరుపబడిన ప్రాయశ్చిత్త దినములు చూపిన విధముగా సార్థకమైన బలి అర్పించినప్పుడు ఒక చిత్రము జ్ఞాపకము చేసుకొనబడింది. వేద పుస్తకము (బైబిలు) వివరించునట్లు

15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.

కొలస్సయ్యులకు 1:15

సార్థకమైన బలి అర్పించినప్పుడు, అదృశ్యుడైన దేవుని స్వరూపము జ్ఞాపకము చేసుకొనబడింది, ఆయనే యేసు అను నరుడు.

పరిస్థితిని సమీక్షించుట

మనము వేద పుస్తకమును (బైబిలు) అధ్యయనం చేస్తున్నాము. ఆయన ప్రణాళికను బయలుపరచుటకు దేవుడు అనేక చిహ్నములను ఇచ్చాడని మనము చూశాము. ఆదియందు ఆయన రానున్న ‘ఆయన’ను గూర్చి ప్రవచించాడు. దాని తరువాత శ్రీ అబ్రాహాము అర్పించిన బలి, పస్కా బలి, మరియు ప్రాయశ్చిత్త దినమును చూస్తాము. ఇశ్రాయేలీయుల మీద మోషే యొక్క ఆశీర్వాదములు మరియు శాపములు కూడా తరువాత ఉన్నాయి. ఇది వారి చరిత్రను కొనసాగిస్తు ఇశ్రాయేలీయులను ప్రపంచమంతా చెదరగొట్టింది, మరియు ఇక్కడ వివరించబడినట్లు భారత దేశములోనికి కూడా చెదరగొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *